హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు మిషన్ భగీరథ తాగునీటి కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు అంకితభావంతో కృషిచేస్తున్నారని సీఎంవో, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితాసబర్వాల్ అభినందించారు. ఇప్పటివరకు 99.60% ప్రభుత్వ విద్యాసంస్థలకు కనెక్షన్లు ఇవ్వడం పూర్తయిందని, మిగిలిన వాటికి అక్టోబర్ 2లోగా ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం ఆమె ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని స్మితాసబర్వాల్ సూచించారు.
ప్రతి గ్రామానికి రోజూ నిర్దేశిత పరిమాణంలో నీటిని సరఫరా చేసేందుకు అంతరాయం కలగకుండా చూడాలని, పైప్లైన్లు లీకైతే తక్షణమే మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. మండలాలవారీగా మొబైల్ టీమ్లు పూర్తి అప్రమత్తతతో ఉండాలని కోరారు. చాలా గ్రామాల్లో స్థిరీకరణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన గ్రామాల్లోనూ నెల రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, సీఈలు, ఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.