నల్లగొండ : జిల్లాపై దివంగత నేత చకిలం శ్రీనివాసరావు చెరగని ముద్రే వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి అప్పట్లో చకిలం ఇల్లే శాశ్వత చిరునామాగా ఉండేదన్నారు. అటువంటి ముద్ర వేసుకోవడం అరుదైనదని, ఆ అదృష్టం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క చకిలం శ్రీనివాసరావుకు మాత్రమే దక్కిందని మంత్రి చెప్పారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన దివంగత కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు 25వ వర్ధంతి సభకు మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో చకిలం శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చకిలం తనయుడు టీఆర్ఎస్ రాష్ట్ర నేత చకిలం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ క్యాడర్కు ఆపద వస్తే మొదట గుర్తుకు వచ్చేది చకిలం శ్రీనివాసరావు ఇల్లే అని గుర్తు చేశారు. నమ్ముకున్న క్యాడర్ కోసం ఎంత దూరమైన వచ్చేవారన్న పేరు శ్రీనివాస్ రావుకు ఉందన్నారు. తనకు అవకాశం కలిగిన ప్రతిసారి నమ్ముకున్న వారికి సముచిత స్థానం ఇచ్చేవారు అని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.