న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవాళ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పరం బీర్ సింగ్ యోచిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడంతో.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరంబీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ దేశ్ముఖ్ అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పరంబీర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
తనను హోం గార్డ్స్ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా పరంబీర్ సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ ఉత్తర్వు చట్టవిరుద్ధం, ఏకపక్షమని పరంబిర్ సింగ్ ఆరోపించారు.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించాలని పరమ్ బీర్ సింగ్కు సూచించింది. దీంతో బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయాలని పరంబీర్సింగ్ న్యాయవాది ముకుల్ రోహత్గి నిర్ణయించారు.
హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఇంటి వెలుపలి సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
తన ఆరోపణలను త్వరగా విచారించకపోతే అనిల్ దేశ్ముఖ్ అన్ని ఆధారాలను తుడిచిపెట్టి, సీసీటీవీని నాశనం చేయగలడని పేర్కొన్నారు. అందువల్ల వీలైనంత త్వరగా దానిపై దర్యాప్తు చేయాలన్నారు.
అనిల్ దేశ్ముఖ్ ఫిబ్రవరిలో తన నివాసంలో పలు సమావేశాల్లో హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ) ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ను కోరారు.
ఆగస్టు 24-25 న అనిల్ దేశ్ముఖ్ తరఫున బదిలీ పోస్టింగ్లో జరుగుతున్న అవినీతి గురించి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇంటెలిజెన్స్ కమిషనర్ రష్మీ శుక్లా.. డీజీపీకి తెలియజేశారు. డీజీపీ ఈ సమాచారాన్ని హోం మంత్రిత్వ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి అందజేశారు.
సంభాషణను టెలిఫోన్ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా ఈ సమాచారం సేకరించినట్లు పిటిషన్లో తెలిపారు. అనిల్ దేశ్ముఖ్పై చర్యలు తీసుకునే బదులుగా రష్మీ శుక్లాను బదిలీ చేశారని ఆరోపించారు.
అవినీతి ఆరోపణల వివాదం ఇలా జరుగుతుండగా.. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం పొద్దుపోయాక ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. పోలీసు అధికారి రష్మి శుక్లా నివేదికను కూడా చర్చించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం రాష్ట్రంలో 86 మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఎక్కువ భాగం క్రైమ్ బ్రాంచ్కు సంబంధించినవి ఉన్నట్లు సమాచారం.
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.