విశ్వనగరంగా వెలుగొందుతున్న భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించడంతోపాటు హైదరాబాద్కు సమాంతరంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను ప్రగతిలో పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. నగరానికి అనుసంధానమైన ఈ రెండు జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి సమష్టిగా పనిచేసేలా నూతన విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. దీన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో అందుతున్న మౌలిక వసతులు, ఆ జిల్లాల పరిధిలోని ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించడంతోపాటు నగరం నలుమూలలా సమాంతర అభివృద్ధి జరిగేలా చూడాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో సమస్యలు? వాటి పరిష్కార మార్గాలు? శాఖల సమన్వయం, ప్రజాప్రతినిధు ల సహకారం తదితర వాటి పై సీఎం శుక్రవారం అధికారులతో ప్రగతిభవన్లో సుదీర్ఘంగా చర్చించారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): మహానగర సమగ్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరానికి అనుసంధానమైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి సమష్టిగా పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. దీనిపై నిరంతరం పర్యవేక్షించేందుకు నోడల్ ఏజెన్సీ కీలకంగా ఉండాలని సూచించారు. ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలు ఉన్నాయో, వాటిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి. మౌలిక వసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వాటి పరిష్కారం కోసం నోడల్ అధికారి అధ్యక్షతన తరచూ సమావేశం కావాలని సూచించారు.
వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడ స్థిర పడుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాల అవసరాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి ప్రణాళికలు రచించాలని సీఎం అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను సమీకరించడంలో నోడల్ ఏజెన్సీ చురుగ్గా వ్యవహరించాలి. నగరం నలుమూలలా సమాంతర అభివృద్ధి జరిగేలా చూడాలి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు విద్య, వైద్యం, విద్యుత్, మునిసిపల్, మిషన్ భగీరథ వంటి మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం అయ్యేలా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు.
గ్రేటర్ నగర శివారు జిల్లాలపై సీఎం కేసీఆర్ విజన్ బ్రహ్మండంగా ఉంది. శివారు ప్రాంతాల్లో నలువైపులా మిగిలిన అన్ని కాలనీలకు మంచినీరు, సివరేజీ పైపులైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు జలమయమై ఇబ్బందులు కలిగిన దృష్ట్యా భవిష్యత్లో ఎలాంటి వరద విపత్తు రాకుండా పనులు చేపట్టేందుకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. సుంకేశుల, కొండపోచమ్మ, కేశవాపూర్ రిజర్వాయర్లు పూర్తయితే 2070 వరకు తాగునీటికి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. – ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో కనివినీ ఎరుగని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ తరహాలో జిల్లాల్లోని మున్సిపాలిటీలు, పట్టణాల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనున్నది. జిల్లాలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంతో పాటు టౌన్హాల్స్ నిర్మాణం, రోడ్లు, విద్యుత్, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను కల్పించడం, సీవరేజీ, నాలాల మరమ్మతు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించనున్నాం.- సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి
సీఎం కేసీఆర్ ముందుచూపు వల్ల నగరం సమగ్రాభివృద్ధిని సాధించడం ఖాయం. శివారు ప్రాంతాల్లో రాబోయే యాభై ఏండ్లలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ సూచించడం సంతోషకరం. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, చెరువుల అభివృద్ధిపై ఆయన ఆలోచనలు గొప్పగా ఉన్నాయి. భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా శాశ్వతంగా సమస్యలు పరిష్కారమయ్యేలా పనులు చేయాలని అధికారులకు సూచించారు. – కుర్మయ్యగారి నవీన్కుమార్, ఎమ్మెల్సీ
శివారు ప్రాంతాలకు మహర్దశ పట్టనున్నది. మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్న విధానం గొప్పగా ఉంది. గతంలో ఏ పాలకులు కూడా నగర శివారు ప్రాంతాల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ శివారు ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి సమవేశాన్ని నిర్వహించి అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ను ప్రకటించడం గొప్ప విషయం. – మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే, కూకట్పల్లి