మహబూబ్నగర్, జూన్ 8 : బాధితుల ఆవేదన నుంచి సహాయ ఫౌండేషన్ పుట్టుకొచ్చింది. ఆపదలో ఉన్న వారికి తమ శక్తి మేరకు సాయం చేస్తూ ముందుకు సాగుతున్నది. ‘తండ్రికి డయాలసిస్ చేసేందుకు ప్రతి నెలా మూడు సార్లు రక్తం అవసరమయ్యేది. ఆ సమయంలో రక్తం అందుబాటులో లేక ఎంతో ఇబ్బందులు పడ్డాం. 45 రోజుల్లో మూడు సార్లు రక్తదానం చేసినా.. నాన్న ప్రాణాలు కాపాడుకోలేకపోయాం. అప్పటి నుంచే రక్తదానం, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో సహాయ ఫౌండేషన్ స్థాపించాం. ఎంతో మందికి సాయం చేసి ఆదర్శంగా నిలుస్తున్నాం.’ అని సంస్థ చైర్మన్ టంకరి శివప్రసాద్ యాదవ్ తెలిపారు. జిల్లాలో ఎవరైనా కరోనాతో మరణిస్తే కులమతాలకతీతంగా దహన సంస్కారాలు చేపడుతున్నారు సహాయ ఫౌండేషన్ సభ్యులు. ‘ప్రతి క్షణం ప్రజలకు సేవ చేస్తాం’ అనే నినాదంతో అడుగులేస్తున్నారు. ప్లాస్మా, ప్లేట్లెట్స్ దానం చేస్తూ తోటి వారికి సాయం చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,800 మందికి రక్తదానం చేశారు. పేదలకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు.
సేవ చేయడంతో సంతృప్తి..
ఇతరులకు సేవ చేయడంలో లభించినంత సంతృప్తి మరే విషయంలోనూ దొరకదు. ఆపదలో ఉన్న వారు తమకు సమాచారం అందిస్తే.. వెంటనే పరిష్కరించేందుకు ముందుకు సాగుతున్నాం. మా నాన్న మరణం, మామ ఇచ్చిన స్ఫూర్తితో ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తున్నాం. వీలైనంత మందికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.