పోటీలో భువనేశ్వర్ కూడా
లంక టూర్కు భారత రెండో జట్టుపై కసరత్తు
న్యూఢిల్లీ: శ్రీలంకలో పర్యటించే భారత పరిమిత ఓవర్ల జట్టుకు సారథి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్ ఓపెనర్ ధవన్, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రధానంగా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న శ్రేయస్ అయ్యర్ అప్పట్లోగా కోలుకోకుంటే ఆ ఇద్దరిలో ఒకరు సారథ్య పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి ప్రధాన ఆటగాళ్లతో కూడిన జంబో టీమ్ టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉండే సమయంలోనే జూలైలో భారత మరో జట్టు శ్రీలంకలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుందని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తొలిసారి ఏకకాలంలో భారత్ నుంచి రెండు జట్లు వేర్వేరు టీమ్లతో మ్యాచ్లు ఆడనున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లే సమయానికి శ్రేయస్ కోలుకుంటాడా లేదా అన్నది స్పష్టత లేదు. ఒకవేళ కోలుకుంటే అతడే కెప్టెన్. లేకపోతే ధవన్, హార్దిక్లో ఒకరికి కెప్టెన్సీ దక్కుతుంది. ఐపీఎల్లో శిఖర్ సూపర్ ఫామ్ కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మంగళవారం చెప్పాడు. అలాగే సారథ్య రేసులో సీనియర్ పేసర్ భువనేశ్వర్ పేరు కూడా వినిపిస్తుండగా.. ధవన్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోచ్గా ద్రవిడ్!
శ్రీలంకకు వెళ్లే భారత రెండో జట్టుకు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీసేన వెంట హెడ్కోచ్ రవిశాస్త్రి ఉండనున్న నేపథ్యంలో యువ జట్టుకు ద్రవిడ్ దిశానిర్దేశం చేయనున్నాడట.
పాజిటివ్ వస్తే టూర్ నుంచి ఔట్..
డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల కోసం ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ సూచించింది. బ్రిటన్కు బయలుదేరే ముందు ముంబైలో నిర్వహించే కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలితే టూర్కు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించింది. ఐపీఎల్ వాయిదా పడడంతో ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఇండ్లలో ఉన్నారు. జూన్ 2న భారత బృందం ఇంగ్లండ్కు పయనమవనుండగా.. అంతకు ముందే ముంబైలో 8 రోజులు క్వారంటైన్లో ఉండనుంది. ఆ సమయంలో పాజిటివ్గా తేలితే ఆటగాళ్లను బ్రిటన్కు తీసుకెళ్లకూడదని నిర్ణయించిందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయబోమని వెల్లడించాయి. కరోనా కేసులు నమోదు కావడంతో ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన నేపథ్యంలో.. ఇంగ్లండ్ పర్యటన కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని బోర్డు భావిస్తున్నది.