కంటోన్మెంట్/ వెంగళరావునగర్/ ఎల్బీనగర్, ఆగస్టు 3: హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు వైద్య సేవలను మరింత విస్తృతపరిచేందుకే నగరం నలువైపులా అధునాతన సూపర్స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నట్టు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం కోసం మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖాన, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రాం గణం, బొల్లారంలోని భారతీయ విద్యాభవన ప్రాంగణాల్లోని స్థలాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఇప్పటికే టిమ్స్ ఏర్పాటుకాగా.. సనత్నగర్ ఏరియాలోని చెస్ట్ దవాఖాన ఆవరణలో 28 ఎకరాల్లో, అల్వాల్లోని బొల్లారం ఏరియాలో 28 ఎకరాల్లో, గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో 28 ఎకరాల్లో సూపర్స్పెషాలిటీ దవాఖానలు నిర్మించనున్నట్టు తెలిపారు. దవాఖానల నిర్మాణ బాధ్యతను సమర్థంగా చేపట్టి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
ఎర్రగడ్డ ఛాతి దవాఖాన ఆవరణలో సూపర్స్పెషాలిటీ దవాఖానతోపాటు అంతర్జాతీయస్థాయిలో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించేందుకు ప్రణాళికతో ముందుకుపోతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సాయన్న, సుధీర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్లు శ్వేతా మహంతి, అమోయ్, డీఎంఈ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.