మల్లికుదుర్ల నుంచి వెంకటేశ్వర్లపల్లె రహదారికి రూ.12 కోట్లు మంజూరు
శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
వేలేరు, మార్చి 28 : మండలంలో మల్లికుదుర్ల గట్టుమల్లికార్జున స్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ ఆలయానికి వెళ్లేందుకు మట్టి రోడ్డు ఉండడంతో ప్రజలు, భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ధర్మసాగర్ మండలం నారాయణగిరి నుంచి మూడు కిలో మీటర్లు, వేలేరు మండలం మల్లికుదుర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. కాగా, ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్శాఖ నిధుల నుంచి సుమారు రూ. 12 కోట్లతో ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామశివారు నుంచి మల్లికుదుర్ల గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం మీదుగా చిల్పూరు మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులకు అనుమతి ఇచ్చింది. బీటీ రోడ్డుకు 2019లో శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం గట్టుమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. ఇప్పటివరకు పనులు మొదలు కాకపోవడంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బీటీ రోడ్డు పనులు పూర్తి అయితే సమీప పక్కల గ్రామాల వారికి కూడా రవాణా సౌకర్యం కలుగుతుంది. అధికారులు, కాంట్రాక్టర్ చొరవ తీసుకుని రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
కరోనాతోనే పనులకు అంతరాయం..
కరోనా పరిస్థితులు, లాక్డౌన్ నిర్ణయం దృష్ట్యా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. గతంలో కురిసిన భారీ వర్షాలతో కూడా కొంతమేరకు పనులకు ఆటంకం కలిగింది. కొన్ని రోజులుగా మట్టి రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టుల్లో పైపులైన్ పనులు జరుగుతున్నాయి. సుమారు నాలుగు నెలల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తాం.