ఘనంగా నిర్వహిస్తామన్న మంత్రులు జగదీశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ మరో జాతీయ స్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. సూర్యాపేటలో ఈనెల 22 నుంచి 25 వరకు గుంతకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ జరుగనుంది. హైదరాబాద్ వెలుపల తొలిసారి జరుగుతున్న జాతీయ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దేశంలోని 29 రాష్ర్టాలకు చెందిన జట్లతో పాటు సాయ్ టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. బుధవారం హైదరాబాద్ ఫతేమైదాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు జగదీశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ టోర్నీ వివరాలను వెల్లడించారు. తొలుత మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీకి పేరొందిన సూర్యాపేటలో టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సుమారు 15వేల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్లను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం క్రీడాహబ్గా మారనుందన్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గానికో మినీ స్టేడియాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిషోర్, లింగయ్య, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, కబడ్డీ సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, మరిపెద్ది శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.