నిజామాబాద్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారంనాడు మంత్రి మోతే. అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్ లోని చెరువులు, చెక్ డ్యాములను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మోతే గ్రామంలో సాగునీటికి సమస్య ఉండేదని దీంతో సీఎం సహాయనిధి నుండి మాటు కాలువకు రూ. 3 కోట్ల 80 లక్షలు మంజూరు చేసి పనులు పూర్తి చేయించినట్లు చెప్పారు. తద్వారా గత సంవత్సరం కొంత ఫలితం వచ్చిందని ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి జూలై నెలలోనే చెరువు నిండడం అలుగు పారడం సంతోషదాయకం అన్నారు.
ముచ్కూర్ లో చెరువు తెగిపోవడాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కట్ట రిస్టోరేషన్ కు ఆదేశాలు జారీచేశారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలంలోని ముచ్కూర్, బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని నీలపల్లి చెరువు విపరీతమైన వర్షాలకు తెగిపోయాయి. దీంతో 150 ఎకరాలలో పంట నీట మునిగి ఇసుక, మట్టి చేరి నష్టం జరిగిందని తెలిపారు. రైతులు కట్టమీదకి పోవడానికి రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేయాలని తహసీల్దారు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు.