న్యూఢిల్లీ: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశ రాజధాని ఢిల్లీలోని పలు మార్కెట్లను అధికారులు, పోలీసులు మూసివేస్తున్నారు. లాజ్పత్ నగర్లోని ప్రసిద్ధ సెంట్రల్ మార్కెట్ను తాజాగా మూసివేశారు. సెంట్రల్ మార్కెట్లో సుమారు రెండు వేలకుపైగా షాపులున్నాయి. ప్రతి రోజు వినియోగదారులు భారీగా వస్తుండటం, కరోనా నిబంధనలు, సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో ఈ మార్కెట్ను తదుపరి ఆదేశాల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.
మరోవైపు సదర్ బజార్లోని రుయి మండి మార్కెట్, పంజాబీ బస్తీ, నాంగ్లోయిలోని జనతా మార్కెట్ను శనివారం నుంచి మంగళవారం వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటించని షాహదర గాంధీ నగర్ మార్కెట్లోని పన్నెండు దుకాణాలను ఈ నెల 4 నుంచి 12 వరకు మూసివేయనున్నారు. అలాగే జన రద్దీ ఎక్కువగా ఉన్న సరోజనీ నగర్, కమలా నగర్ మార్కెట్లలోని షాపులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కరోనా నిబంధనలు పాటించకపోతే మూసివేతతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.