మూసాపేట, జూలై 7 : తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. ప్రమాదవశాత్తు భవనం మూడో అంతస్తు నుంచి పెచ్చులూడి యువతిపై పడటంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్లోని కరమ్కోట గ్రామానికి చెందిన శేఖర్ కూతురు రోజ(25) కూకట్పల్లిలో నివాసముంటూ లాల్గడిమలక్పేటలోని ఎస్పీ అసిక్యూర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. మంగళవారం సాయంత్రం తన స్నేహితురాలు మౌనికతో కలిసి శాంతినగర్లోని శ్రీ బాలాజీ లేడీస్ ఎంపోరియం వద్దకు వెళ్లింది. అక్కడ డిజైనర్ లేకపోవడంతో అక్కడే వేచిచూస్తుండగా.. లేడీస్ ఎంపోరియం ఉన్న బిల్డింగ్ మూడవ అంతస్తులోనుంచి పెచ్చులూడి రోజ తలపై పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తెల్లవారితే రోజకు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. మృతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.