హుజూరాబాద్ రూరల్, జూలై 22 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిస్తే ఏంచేస్తారని ఈటల రాజేందర్ను పశుసంవర్ధకశాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. ఒకవేళ గెలిచినా బీజేపీకి ఒకస్థానం పెరుగుతుందే తప్పా ఇక్కడి ప్రజలకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగు ల కమలాకర్తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. దళిత బంధు, గొర్లు, చేపల పంపిణీ పథకాల అమలు హుజూరాబాద్ ఎన్నికల కోసమే అని మాట్లాడటం సరికాదని.. అవన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంగతి తెలుసుకోవాలని సూచించారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తప్ప మరొకరు అభివృద్ధి చేయలేరని గతంలో మాట్లాడిన ఈటల నోరు ఇప్పుడు ఎందుకు మడత పడుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 4 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తిచేయకపోవడం ఈటల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరో పించారు. పదేపదే హుజూరాబాద్ ప్రజలు అమ్ముడుపోరు అంటున్న ఈట ల.. గడియారాలు, కుక్కర్లు ఎందుకు పంపిణీ చేస్తున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని మండిపడ్డ ఆయన, బీజేపీ వాళ్లకు దమ్ముంటే ఈ రాత్రికే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక జాతీయ ప్రాజెక్ట్ తేవాలని డిమాండ్ చేశాడు. ఈ సమావేశంలో మంత్రులు గంగుళ కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సతీషకుమార్, రవిశంకర్, ఎమ్మెల్సీలు మల్లేశం యాదవ్, బస్వరాజు సారయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ తదితరులు ఉన్నారు.