సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినదని, బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్దనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మీకు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేండ్ల నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేద బాగోగులు ఆలోచించే గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఆలోచనలతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగినదని వివరించారు. ఒక పైసా లబ్ధిదారుడిపై భారం పడకుండా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా 45 ఏండ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా నేడు ఎన్నికలు వస్తుండటంతో అది చేస్తాం…ఇది చేస్తామంటూ వస్తున్నారని మంత్రి తలసాని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నంత కాలం పదవులను కాపాడుకోవడం, తమ వారి బాగుకోసమే కాంగ్రెస్ నాయకులు పరితపించారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన పాలన కొనసాగుతున్నదని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలులో దేశంలోనే పెద్ద కదలికను తీసుకొస్తుందని, అన్ని రాష్ట్రాలలో ఈ పథకం అమలు కోసం ప్రజల నుంచి డిమాండ్ రాబోతున్నదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
బేగంపేట్, ఆగస్టు 13: డబుల్ ఇళ్ల గురించి సత్యదూరమైన విమర్శలకు దిగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్రెడ్డి తన పార్టీ రాష్ట కార్యాలయం సమీపంలో నిర్మించిన ఇళ్లను కళ్లు చూసిన తరువాత మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలో డబుల్ ఇళ్ల నిర్మాణాల గురించి జి.కిషన్రెడ్డి శనివారం ఇందిరా పార్క్ దగ్గర చేసిన ఆరోపణలను మంత్రి తలసాని త్రీవంగా ఖండించారు. ఆదివారం మారేడ్పల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అతి సమీపంలో నిర్మించిన డబుల్ ఇండ్ల నిర్మాణాలు కిషన్రెడ్డి కళ్లకు కనిపించడం లేదా అంటూ విమర్శించారు. విమర్శలు ఎదుర్కోవడం తెలంగాణ ప్రభుత్వానికి కొత్త కాదని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామని మంత్రి సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరిన తెలంగాణ మరాఠాలకు కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. గోషామహల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకురాలు మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో మరాఠాలు పెక్కు మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
– సుల్తాన్ బజార్, ఆగస్టు 13