న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూలై వచ్చినా వ్యాక్సిన్ల జాడ లేదని..వ్యాక్సిన్లు ఎక్కడ అంటూ రాహుల్ శుక్రవారం ట్వీట్ చేశారు. జులై 1 నుంచి ప్రజలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్సు అందిస్తామని కేంద్రం చేసిన ప్రకటనల నేపథ్యంలో రాహుల్ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. మరోవైపు రాహుల్ ప్రకటనను బీజేపీ తప్పుపట్టింది.
ఈ నెలకు సంబంధించి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లపై తాను గురువారం సమాచారం ఇచ్చానని, అజ్ఞానానికి ఎలాంటి వ్యాక్సిన్ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాహుల్కు చురకలు అంటించారు. జులై వ్యాక్సినేషన్ డేటాను తాను స్పష్టంగా చెప్పిన విషయాలను రాహుల్ చదవలేదా ఆయనకు అర్ధం కాలేదా అని ఎద్దేవా చేశారు.
రాహుల్ ప్రకటనపై బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా అభ్యంతరం వ్యక్తం చేశారు. జులై 1న 41.60 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారని, జూన్ 21 నుంచి జులై 1 మధ్య రోజుకు సగటున 62 లక్షల డోసుల చొప్పున 6.85 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారని భాటియా వివరించారు.