హైదరాబాద్: రాష్ట్రంలోని సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా రెండు చోట్ల వ్యాక్సిన్ పంపిణీని మంత్రి ఆరంభిస్తారు. ఉదయం 10 గంటలకు సనత్నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, ఉదయం 10.30 గంటలకు బన్సీలాల్పేటలో వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుడతారు. ఇవాళ, రేపు జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ ఉంటుంది. హైదరాబాద్లో ఐదుచోట్ల ఐదుచోట్ల జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు పంపిణీ చేస్తారు.
నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాల తీర్చే దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జర్నలిస్టులు తదితరులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనా వైరస్ చైన్ను తెంచడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు గుర్తించారు.
ప్రత్యేక డ్రైవ్ ద్వారా మొదటి దశలో 7.75 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేసింది. 33,980 మంది రేషన్ డీలర్లు, 49,611 మంది గ్యాస్ డీలర్లు, సిబ్బంది, 1,435 మంది ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగులు, 30 వేల మంది ఎరువులు, విత్తనాల దుకాణదారులు, సిబ్బంది, 20 వేల మంది జర్నలిస్ట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల మంది అటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, రైతుబజార్లలో వర్తకులు, మార్కెట్ యార్డు సిబ్బంది, హమాలీలు, వీధి వ్యాపారులు, 3 లక్షల మంది సెలూన్ల నిర్వాహకులు, 91 వేల మంది కిరాణదుకాణాల సిబ్బంది ఉన్నారు.