హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెట్ సిల్వర్ కాంపౌండ్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు కండ్లుండి చడగలిగితే డబుల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తాయన్నారు. రూ.14 కోట్లతో 168 ఇండ్లను నిర్మించామని చెప్పారు. తన నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే సాయన్న నిరంతరం తపిస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న సహకారంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నందుకు తెలంగాణ ప్రజలంతా అదృష్టవంతులని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అనేక గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ధనవంతుల ఇళ్లలా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయని చెప్పారు.