మహబూబ్నగర్ : జిల్లా అభివృద్ధిలో అధికారులు మరింత ప్రభావశీలంగా పనిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మహబూబ్నగర్ వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైతే రాత్రి 2:30 గంటల ప్రాంతంలో తాను మహబూబ్నగర్లో ద్విచక్ర వాహనంపై పర్యటించినట్లు తెలిపారు.
దూద్ దవాఖాన స్థానంలో నిర్మాణం అవుతోన్న నూతన దవాఖాన నిర్మాణ పనుల్ని 2నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు రైతులకు ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే అందించాలని ఆదేశించారు. రూ. 120కోట్ల వ్యయంతో 6 మైనారిటీ గురుకులాలను వీరన్నపేట్ ప్రాంతంలో ఒకే ప్రాంగణంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తున్నామని తెలిపే హోర్డింగ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.
జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వరకు ప్లాంటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అటవీ శాఖా అధికారులను ఆదేశించారు. గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాయాల్లో మిగిలిపోయిన సీట్ల వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలన్నారు. మిగిలిపోయిన సీట్లకు చాలా మంది అర్హులైన పేద విద్యార్థులకు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాల ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరపలన్నారు. అధికారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తన దృష్టికి తీసుకువస్తే, వాటిని పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ వచ్చేకంటే ముందే రహదారుల సుందరీకరణ పూర్తి చేయాలన్నారు.
అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ యస్.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారాం, డీఆర్వో స్వర్ణలత, వైద్యకళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthi : సరళాసాగర్కు జలకళ
మార్స్ గ్రహంపై రాళ్లను సేకరించిన నాసా రోవర్
Lmd Reservoir : ఎల్ఎండీకి భారీగా ఇన్ఫ్లో