హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతంత్య్ర భారత అమృతోత్సవం పేరుతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ సాగించిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించిందని పేర్కొన్నారు. ఇక్కడ అమలుచేస్తున్న అత్యుత్తమ ఇండస్ట్రియల్ పాలసీతో ఇతర రాష్ర్టాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణకు వస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులు తెలుగు రాష్ర్టాల్లో పర్యటించేలా తానా సభ్యులు కృషిచేయాలని కోరారు. సమావేశంలో తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి, మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ డాక్టర్ హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.