హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ టూరిజం పాలసీ కోసం కసరత్తు చేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లాకు ఒక టూరిజం సర్క్యూట్, రాష్ట్రస్థాయిలో ఐదు సర్క్యూట్లు ఏర్పాటుచేసి రాష్ర్టాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో స్టేట్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో తెలంగాణలోని చారిత్రక కట్టడాల ప్రాధాన్యం బయటికి రాకుండా తొక్కేశారని ఆరోపించారు. రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు రావాల్సిన కట్టడాలు 20కి పైగా ఉన్నప్పటికీ గత పాలకులు నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా తెచ్చుకున్నామని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్టీడీసీ ఎండీ మనోహర్రావు, హ్యాండ్బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్, అవార్డులు పొందిన హోటళ్ల నిర్వహకులు, అధికారులు పాల్గొన్నారు.