నారాయణపేట : కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను వదులుకునే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. బంగారం, చేనేతకు ప్రసిద్ధి గాంచిన నారాయణపేటకు గత పాలకులు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు తాగునీటి ఇబ్బందులు లేవన్నారు. 70 ఏండ్ల కాలంలో అభివృద్ధి చెందని నారాయణపేట.. ఇప్పుడు వడివడిగా అభివృద్ధి చెందుతోందన్నారు. తమ దృష్టంతా అభివృద్ధి పైనే అని స్పష్టం చేశారు. ఎవరైనా అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి దేశంలోని ఇతర రాష్ర్టాల్లో జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ర్టం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.