కాప్రా/మల్లాపూర్, మే 31: పారిశుధ్య విభాగంలో విధుల్లో కొనసాగాలంటే.. లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి.. డబ్బులు తీసుకుంటూ కాప్రా సర్కిల్ శానిటేషన్ విభాగం డీఈఈ (ఎస్డబ్య్లూఎం) పి.మహాలక్ష్మి సోమవారం ఉదయం ఏసీబీకి చిక్కింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం…మల్లాపూర్లో పారిశుధ్య విభాగంలో శానిటరీ వర్కర్గా పనిచేసిన రాములు అనే వ్యక్తి కొంతకాలం క్రితం మృతిచెందగా.. ఆయన భార్య సాలమ్మ ఇటీవల స్వీపర్గా విధుల్లో చేరింది. అయితే.. సాలమ్మ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్టర్ వర్కర్గా పనిచేయాలంటే తనకు రూ.20వేలు ఇవ్వాలని శానిటేషన్ విభాగం డీఈఈ మహాలక్ష్మి డిమాండ్ చేసింది. రోజు,రోజుకూ ఆమె వేధింపులు ఎక్కువకావడంతో సాలమ్మ.. ఈ విషయాన్ని తన కుమారుడు శ్రీనివాస్కు చెప్పగా.. అతను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
సోమవారం ఉదయం మల్లాపూర్లోని యాదగిరి ఫంక్షన్హాల్ వద్ద శ్రీనివాస్ నుంచి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) విజయ్ ద్వారా లంచం తీసుకుంటున్న డీఈఈ మహాలక్ష్మిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెను, ఎస్ఎఫ్ఏను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మల్లాపూర్ వార్డు కార్యాలయంలో విచారించినట్లు సమాచారం. అలాగే మహాలక్ష్మి నివసించే చక్రీపురంలోని ఆమె నివాసంపై దాడులు నిర్వహించి నగదు, బంగారం, స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. డీఈఈ మహాలక్ష్మి 2020, మార్చి 3న కాప్రా సర్కిల్ డీఈఈగా పదోన్నతిపై విధుల్లో చేరారు. అంతకు ముందు ఆమె యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఏఈగా పనిచేయగా, పదోన్నతిపై కాప్రా సర్కిల్కు బదిలీ అయింది. కాగా.. మహాలక్ష్మిని విచారిస్తున్న క్రమంలోనే.. కాప్రాసర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయిని కూడా మల్లాపూర్ వార్డు కార్యాలయానికి పిలిపించి ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం.