హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గల తన కార్యాలయంలో యూనెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రామప్ప దేవాలయంను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినందుకు హెరిటేజ్ తెలంగాణ శాఖ తరపున, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రామప్ప దేవాలయంపై యునెస్కో సూచించిన మార్గదర్శకాలపై డిసెంబర్ 2022 లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై మంత్రి చర్చించి పలు సూచనలను, సలహాలను చేశారు. కాకతీయల కాలంనాటి అద్భుతమైన కళాసంపదను, తెలంగాణ సంస్కృతిని యూనెస్కో సంస్థ గుర్తించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేల ఏళ్ల నాటి చారిత్రాత్మక సంపద, ఎన్నో అత్యద్భుతమైన ప్రదేశాలున్నాయన్నారు. రామప్ప దేవాలయంను యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ కొన్ని సూచనలు చేసిందన్నారు. యూనెస్కోకు సమర్పించిన DOSSIER లో పొందుపరిచిన సమాచారానికి లోబడి ఉండాలన్నారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం సమీపంలో వున్న చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను సిద్దం చేయాలని తెలంగాణ హెరిటేజ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రామప్ప దేవాలయంలో కేంద్ర ఆర్కియాలజీ శాఖకు చెందిన స్థలం వాటి సరిహద్దులు గుర్తించాలన్నారు. తెలంగాణ హెరిటేజ్ శాఖ అధీనంలో ఉన్న స్థలం అభివృద్ధి చేసేందుకు, తీసుకునే చర్యలపై మంత్రి చర్చించి పలు సూచనలు, సలహాలు చేయడం జరిగింది. రామప్ప దేవాలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మిత ఎస్. కుమార్, వైఏటీఎస్ జాయింట్ సెక్రటరీ కె. రమేష్, హెరిటేజ్ తెలంగాణ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.