హైదరాబాద్ : అక్టోబర్-2022లో జరిగే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్కు హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ సన్నాహక ఏర్పాట్లపై రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో క్రీడారంగంలోనూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఢిల్లీ, బెంగుళూరులో కంటే హైదరాబాద్ లోని గోల్ఫ్ క్లబ్ అద్భుతంగా ఉందని పలువురు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు కితాబిచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్ద పీట వేసి అనేక క్రీడా మైదానాలు నిర్మించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 2022 నాటికి పూర్తి స్థాయిలో టోర్నమెంట్ నిర్వాహణ పనులును పూర్తిచేసుకోవాలని గవర్నింగ్ బాడీ సభ్యులకు మంత్రి సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో గోల్ఫ్ క్లబ్ గవర్నింగ్ సభ్యులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి కెఎస్. శ్రీనివాస రాజు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, కేంద్ర పురావస్తు శాఖ రీజినల్ డైరెక్టర్ డా. స్మిత ఎస్. కుమార్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సెక్రటరీ బీవీకే రాజు, కెప్టెన్ భాస్కర్ రెడ్డి, ఏఎస్ఐ, టూరిజం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.