హైదరాబాద్ : 28వ కన్వర్జెన్స్ ఇండియా-2021 అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అదేవిధంగా 6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో హైదారాబాద్కు వివిధ కేటగిరిల్లో మూడు అవార్డులు లభించాయి. కేంద్రానికి చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఎగ్జిబిషన్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు చెందిన హెచ్జీసీఎల్, ఎండీ బి.యం.సంతోష్ , జీఎహ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదనపు కమిషనర్ బి.సంతోష్, ఎన్.ఐ.యు.యం. అవుట్ రీచ్ మేనేజర్ వంశీ కోండుజూలు ఈ అవార్డులు అందుకున్నారు.
• కేటగిరి -1లో గ్రీన్ అండ్ క్లీన్ సిటీ క్రింద బేగంపేట ప్లై ఓవర్ వద్ద అభివృద్ధి చేసిన రెయిన్ గార్డెన్కు అవార్డు లభించింది. కూకట్పల్లి, యుసుఫ్గూడ నుండి వచ్చే సివరేజి నాలాలు బేగంపేట ప్లై ఓవర్ క్రింది భాగంలో కలుస్తాయి. ఈ రెండు నాలాలు కలిసి ప్రవహించే సివరేజి నాలా వున్న చోట 400 మీటర్ల పొడవున 5 ఎకరాల విస్తీర్ణంలో రెయిన్ గార్డెన్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
• కేటగిరీ -2లో స్మార్ట్ వేస్ట్ డిస్పోజల్ ప్రాజెక్ట్ క్రింద న్యూమున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు అవార్డు లభించింది. ఘన వ్యర్ధాల సేకరణ, రవాణాకు దేశంలోనే అత్యంత ఆధునిక, పర్యావరణహిత, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. స్మార్ట్ సెల్ఫ్ కంపాక్టు సీల్డ్ వాహనాల ద్వారా వ్యర్ధాలను తరలిస్తున్నారు. పూర్తిస్థాయి యాంత్రీకరణ నెట్ వర్క్తో నగర వ్యాప్తంగా సెకండరీ కలెక్షన్, టాన్స్ పోర్టు పాయింట్స్ (SCTPs) అనుసందానమై ఉన్నాయి. ఘనవ్యర్దాల సేకరణ, తరలింపులో దేశంలోని అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని, వాహనాలను వినియోగిస్తున్నారు.
• కేటగిరీ -3 క్రింద వి-హబ్ కు స్టార్ట్అప్ అవార్డు లభిస్తుంది. వి హబ్ ద్వారా మహిళ సాదికారితకై కమ్యూనిటీ సహకారంతో మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చేందుకు వినూత్నంగా తీసుకున్న చొరవకు గుర్తింపు లభించింది. పరిశ్రమలు నెలకొల్పుటకు, అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకొనుటకు , కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుటకు, వ్యాపారాభివృద్ధికి వి హబ్ వేదికగా నిలుస్తున్నది.