హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ రూ.27.50 లక్షలు మంజూరు చేశారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. రాష్ట్ర పర్యాటక, హెరిటేజ్ శాఖలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ శనివారం హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వేడుకల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో రూ.12 లక్షలు, ఒక్కో జిల్లా కేంద్రానికి రూ.50 వేలు విడుదల చేశామన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలోని చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాలకు తగిన ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామ ప్ప దేవాలయానికి తగిన ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మిగిలిన చారిత్రక కట్టడాలపై తగిన ప్రతిపాదనలు తయారుచేసి యునెస్కోకు సమర్పించాలని ఆదేశించారు.
ప్రచార నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. గతేడాది పర్యాటక దినోత్సవాన్ని పుస్కరించుకొని ప్రకటించిన అవార్డులను కొవిడ్ కారణంగా ఇవ్వలేకపోయామని, వాటిని ఈ ఏడాది ఇచ్చే అవార్డులతో కలిపి ప్రదానం చేస్తామని చెప్పారు. వివిధ విభాగాల్లో అవార్డుల కోసం www. telanganatourism.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూరించిన దరఖాస్తులను సెప్టెంబర్ 4లోగా పర్యాటకశాఖ కార్యాలయంలో అందజేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సమీక్ష సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, జాయింట్ సెక్రటరీ రమేశ్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్రెడ్డి, టూరిజం అధికారులు ఓం ప్రకాశ్, మహేశ్, తెలంగాణ హెరిటేజ్శాఖ అధికారులు నారాయణ, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.