వ్యాపారులకు వలవేస్తున్న సైబర్ నేరగాళ్లు
జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు నయా పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు.. కరోనా నేపథ్యంలో పలువురు వ్యాపారులు తమ ఉద్యోగుల సంక్షేమ కోసం.. వ్యాక్సిన్ ఇప్పించడానికి ఇంటర్నెట్లో గాలిస్తున్నారు. దీన్నే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.. మీ వద్దకే వచ్చి వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ ఫోన్లుచేసి వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. గూగుల్ నుంచి ఆయా వ్యాపారుల ఫోన్ నంబర్లు సేకరించి.. వ్యాపార సంస్థలకు ఫోన్లు చేస్తున్నారు. అక్కడి నుంచి నిర్వాహకులవి, ఆయా సంస్థల మేనేజర్ల నంబర్లు సేకరిస్తున్నారు.
ఆ తరువాత తాము మెడికల్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మిస్తారు.. గురువారం నగరంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్నగర్లో ఉండే ఒక వస్ర్తాల వ్యాపారికి ఫోన్చేసి, దుకాణంలో పనిచేసే సిబ్బందికి వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ నమ్మించి.. రూ.1.10 లక్షలు కాజేసిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా విజృంభణతో సైబర్నేరగాళ్లు వేసే వలలో ఈజీగా వ్యాపారులు మోసపోయే అవకాశాలున్నాయని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే వస్తుందని, మోసపూరిత మాటలు నమ్మి సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచిస్తున్నారు.