ధర్మపురి, ఏప్రిల్ 22: ధర్మపురి క్షేత్రం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, యాదా ద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయం లో ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధిపై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి, వేములవాడ క్షేత్రాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ఇప్పటికే ధర్మపురి అభివృద్ధికి 120కోట్లు ప్రకటించగా, మొద టి విడతగా 61.66కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. ప్రగతి నమూనా, ప్రతిపాదనలు, ప్రణాళికలపై చర్చించారు. ఆలయ పరిసరాలను అద్భుతంగా తీర్చిదిద్దడం, దేవస్థానం విస్తరణకు స్థల సేకరణ, గోదావరి నది వద్ద ఘాట్ల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రధాన ఆలయం రాతి కట్టడంతో పునర్నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టాలన్నారు.
ఉగ్రనారసింహస్వామి ఆలయంలోనూ పనులు చేపట్టాలన్నారు. యమ ధర్మరాజు ఆలయాన్ని పునర్నిర్మించాలని, సత్యవతి దేవాలయంతో పాటు ఇసుక స్తంభం ఆధునీకరించాలన్నారు. శివాలయం ముఖద్వారం పునర్నిర్మించాలని సూచించారు. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన పుట్టబంగారం సేకరణ స్థలం అభివృద్ధి చేయాలని, కోనేరుకు సాలాహారం దారి విస్తరించాలని సూచించారు. జాతీయ రహదారిపై రాయపట్నం, తుమ్మెనాల వద్ద భక్తులకు స్వాగతం పలికే విధంగా ఆర్చ్గేట్ నిర్మించాలన్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ ఆహారం అందించేలా మహా అన్నదాన సత్రం, స్వామివారి కల్యాణం కోసం మండపం, శేషప్ప కళాభవనం నిర్మించాలన్నారు. అలాగే మువ్వురు స్వాములకు నూతన రథాల తయారీతో పాటు రథశాల నిర్మించాలన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ స్థాయికి వెళ్లేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక్కడ దేవాదాయ శాఖ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రతి ఒక్కరు టీకాను వేసుకోవాలి : బీపీ ఆచార్య
ఇండియాకు సాయం చేయడానికి సిద్ధం: చైనా