హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధంచేయాలని, మే 15వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రుల నివాస ప్రాంగణంలో విత్తన సమీకరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వానకాలంలో కంది 20 లక్షల ఎకరాల్లో, 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని ఆదేశించారు. ఇందుకు 80 వేల క్వింటాళ్ల కంది విత్తనాలు, 1.70 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను సిద్ధంచేయాలని చెప్పారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ టీంలు ఏర్పాటుచేసి అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదుచేయాలని ఆదేశించారు. దేశంలో తొలిసారిగా క్యూ ఆర్ కోడ్, సీడ్ ట్రేసబిలిటీతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని స్పష్టంచేశారు. వరి సాగును తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజల సాగు వైపు వెళ్లాలని రైతులను కోరారు. సమావేశంలో విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, జేడీఏ బాలు, డీడీఏ శివప్రసాద్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.