డబ్ల్యూహెచ్వో జిల్లా పరిశీలకురాలు అనూష
శాయంపేట, జూన్ 10: ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సినే శ్రీరామరక్ష అని ప్రపంచ ఆరోగ్య సంస్థ జిల్లా పరిశీలకురాలు డాక్టర్ అనూష అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ను గురువారం ఆమె పరిశీలించారు. పది మందికి కొవాగ్జిన్ రెండో డోస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా టీకాలు ఎలా వేస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మండలంలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని, వసంతాపూర్లో అధికంగా కేసులు ఎందుకొచ్చాయని అడిగారు. ఆమె వెంట వైద్యాధికారి నాగశశికాంత్ ఉన్నారు.
బయటకు రావొద్దు
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయటకు రావొద్దని పీహెచ్సీ వైద్యాధికారి నాగశశికాంత్ కోరారు. వసంతాపూర్, కాట్రపల్లిలో కరోనా కేసులు పెరగడంతో సిబ్బందితో కలిసి ఆయన బాధితుల ఇండ్లకు వెళ్లి మాట్లాడారు. మందులు ఎలా వాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. బయటకొస్తే వైరస్ వ్యాప్తిచెందుతుందని సూచించారు. ఆయన వెంట హెచ్ఈవో వెంకటేశ్వరవర్మ, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ఉన్నారు.
104 ఆధ్వర్యంలో వైద్య శిబిరం
కాట్రపల్లిలో 104 ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షణాలున్న 75 మందికి పరీక్షలు చేశారు. 14 మందికి పాజిటివ్ వచ్చింది. బుధవారం చేసిన టెస్టుల్లోనూ ఆరు కేసులు నమోదయ్యాయి. వసంతాపూర్లో భారీగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా పక్కనే ఉన్న కాట్రపల్లిలోనూ పాజిటివ్ వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తంగా మండలంలో గురువారం 91 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 కొత్త కేసులు నమోదైనట్లు పీహెచ్సీ వైద్యులు తెలిపారు.
కొనసాగుతున్న కరోనా పరీక్షలు
ఆత్మకూరు/దామెర/రాయపర్తి/చెన్నారావుపేట: ఆత్మకూరులోని పీహెచ్సీలో 103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 10 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రణధీర్ తెలిపారు. ఇంట్లో సరైన సౌకర్యాలు లేని వారు సెయింట్ థెరిస్సా స్కూల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలో ఉండాలని సూచించారు. దామెరలోని ప్రభుత్వ హైస్కూల్లో దామెర, పులుకుర్తి, కోగిల్వాయి, వెంకటాపురం గ్రామాలకు చెందిన ప్రజలకు కరోనా పరీక్షలు చేశారు. రాయపర్తిలోని జడ్పీఎస్ఎస్లో కరోనా పరీక్షల శిబిరాన్ని వైద్యాధికారి భూక్యా వెంకటేశ్ సందర్శించారు. 70 మందికి పరీక్షలు చేయగా, ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. చెన్నారావుపేటలో 147 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 10 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారిణి ఉషారాణి తెలిపారు.