హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆజన్మాంతం తెలంగాణ కోసం పోరాడారని, న్యాయం కోసం నినదించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి ఘనంగా నివాళులు అర్పించారు. నమ్మిన లక్ష్యం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాంతం పోరాడారని చెప్పారు. అరాచకాలు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు చాకలి ఐలమ్మ, రావినారాయణ రెడ్డి, కొమురం భీమ్ వంటి నేతలకు న్యాయం అందించడానికి న్యాయ కోవిదులుగా ఆయన సేవలు చిరస్మరణీయమని వెల్లడించారు. భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమ, రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలిసారిగా మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదిలేసిన గొప్ప త్యాగమూర్తని, మూడుతరాల ఉద్యమ నాయకుడునై బాపూజీ నేటి రాజకీయ నేతలకు ఆదర్శ ప్రాయుడన్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఆయన పేరును ఉద్యానవన విశ్వవిద్యాలయానికి పెట్టి చిరస్థాయిగా ఉండేటట్లు చేశారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు.