వరంగల్ : ఉమ్మడి వరంగల్లో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నాయి. దేశం తరపున యునెస్కోకు వెళ్ళిన రెండు ప్రతిపాదనల్లో మన రామప్ప ఆలయం ఉండడం మనకు గర్వ కారణము. రామప్పకు యునెస్కో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశం నుంచి వెళ్లిన రెండు ప్రతిపాదనల్లో ఒకటి తెలంగాణకు చెందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయం ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు యునెస్కో కట్టడాల గుర్తింపు సమావేశాలు ప్యారిస్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావాలని మంత్రి సత్యవతి నేడు ఆ ఆలయాన్ని సందర్శించి శ్రీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామప్ప కళా నైపుణ్యాన్ని అధికారులు మంత్రికి వివరించారు. ఆ తరవాత దేవాలయ ప్రాంగణ పరిధిలో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రామప్ప ఆలయ నిర్మాణంలో ఎంతో గొప్ప కళానైపుణ్యం ఉందన్నారు. శివుడు నెలకొన్న గర్భగుడిలో వెంటిలేషన్ సదుపాయం లేకున్నా లోపల వెలుగు ఉండేలా దీనిని అద్భుతంగా నిర్మించారు. 800 ఏళ్లుగా ఇక్కడి రాయి రంగు కూడా మారకపోవడం మరొక విశిష్టత అని పేర్కొన్నారు. అందుకే ఇంత విశిష్టమైన రామప్పను ప్రపంచ స్థాయి సంపదగా గుర్తించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. అయితే ఈ ఆలయం విశిష్టతను తెలిపే విధంగా మ్యూజియం ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రామప్ప చెరువును రిజర్వాయర్గా మార్చిన తరవాత ఈ ప్రాంతంలో వ్యవసాయం పెరిగే అవకాశం ఉన్నది. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సత్యవతి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి సత్యవతితో పాటు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు ఎస్పీ సాయి చైతన్య, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.