సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): అతడో కరుడుగట్టిన దొంగ. దొంగతనాలు చేయడం, జైలుకు వెళ్లడం.. జైలు నుంచి రాగానే తిరిగి నేరాలకు పాల్పడుతుంటాడు. పోలీసులు రెండు సార్లు పీడీ యాక్ట్ ప్రయోగించినా.. బుద్ధి మారలేదు. ఎట్టకేలకు ఆ దొంగను హుమాయున్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. గోల్కొండ రేషమ్బాగ్కు చెందిన మహ్మద్ ఇబ్రహీం కారు డ్రైవర్. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, అందుకు కావాల్సిన డబ్బుల కోసం దొంగనాల బాటపట్టాడు. 2005 నుంచి వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడటం, జైలుకు వెళ్లడం.. కొన్నాళ్లకు బయటకు వచ్చి.. తిరిగి దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు.
ఇప్పటి వరకు రెండుసార్లు పీడీ యాక్టు పెట్టినా మారలేదు. ఇతనిపై 53 దొంగతనం కేసులతోపాటు ఒక హత్య కేసు కూడా ఉంది. హుమాయున్నగర్లో జరిగిన ఓ దొంగతనం కేసులో దర్యాప్తు ప్రారంభించిన డీఐ నారాయణరెడ్డి బృందానికి మంగళవారం గోల్కొండ ప్రాంతంలోని రేతిగల్లీలో ఇబ్రహీం చిక్కాడు. నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి 3 తులాల బంగారం, రూ.10 వేల నగదు, బైక్, దొంగతనానికి ఉయోగించే రాడ్, టార్చ్, బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇండ్లను గుర్తించి, తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటాడని, ఈ నేరస్తుడిపై మరోసారి పీడీయాక్టు ప్రయోగిస్తామని సీపీ వివరించారు.సమావేశంలో వెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, అదనపు డీసీపీ ఎక్బాల్ సిద్ధిఖీ, ఆసిఫ్నగర్ ఏసీపీ శివమారుతి పాల్గొన్నారు.