జనగామ : జిల్లా పర్యటనకు వచ్చే సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలకాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం జనగామలో ఆమె మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ జనగామ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణుల తరఫున స్వాగతం పలుకుతున్నామన్నారు. గతంలో సీఎం కేసీఆర్ సభ వాయిదా పడింది, ఈ క్రమంలోనే కేసీఆర్ రాక కోసం జిల్లా ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు.
ఎడారిగా ఉన్న జిల్లా కేసీఆర్ నాయకత్వాన ఇప్పుడు సస్యశ్యామలమైందన్నారు. గతంలో తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారికి.. రేపు ప్రారంభించే సమీకృత కలెక్టరేట్, ఇప్పటికే వచ్చిన సాగు, తాగునీరు ఎలా వచ్చింది చూస్తే అర్థమవుతుందన్నారు. కరువు జిల్లాలో ఇకపై నీళ్లు రాని ఊరు ఉండొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని, అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇవ్వాలన్నారని మంత్రి తెలిపారు. ఫలితంగా నేడు రైతులు పంటలు పండిస్తున్నారని, దేశంలో ఒకే పంటలోనే అత్యధికంగా దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందన్నారు.
చరిత్ర తెలియని వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండడం దురదృష్టకరమని సత్యవతి రాథోడ్ విమర్శించారు. తెలంగాణపై బీజేపీ అన్యాయంగా మాట్లాడుతుందని, రాష్ట్రాన్ని అన్యాయంగా ఇచ్చినట్లు ప్రధాని అంటున్నారని ఆరోపించారు. ఎవరితో సాధ్యం కాని తెలంగాణ.. కేసీఆర్తో సాధ్యమైందన్నారు. అలాగే దేశంలోని నాయకులను కూడగట్టుకొని తన పదవికి ఎసరు పెడతారని భావించి అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు ప్రజలను తరలించే క్రమంలో నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఇతర నాయకులు ఉన్నారు.