కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నందిగ్రామ్లో అక్కచెల్లెళ్లు, తల్లుల ఆదరణ కోసమే తాను ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగానని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సోనా చురా ప్రాంతంలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో దీదీ మాట్లాడారు.
తాను రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయగలనని, అయితే ఇక్కడి తల్లులు, సోదరీమణులను గౌరవించే ఉద్దేశంతో నందిగ్రామ్ను ఎంచుకున్నాని చెప్పారు. నందిగ్రామ్ ఉద్యమానికి వందనాలంటూ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. ఇక ఈ ప్రాంతాన్ని తాను విడిచిపెట్టనని ఇక్కడే ఉంటానని అన్నారు. బీజేపీని నందిగ్రామ్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి తరిమికొట్టాలని కోరారు. నందిగ్రామ్లో మమతా బెనర్జీపై బీజేపీ తరపున సువేందు అధికారి పోటీ చేస్తుండగా ఈ నియోజకవర్గంలో రెండో విడతలో ఏప్రిల్ 1న పోలింగ్ జరగనుంది.