మహబూబాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆత్మరక్షణ కోసమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్లోని తన నివాసంలో మంత్రి సత్యవతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీకి, ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా పార్టీ, పదవుల నుంచి తొలగించడం కేసీఆర్ చేస్తారనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సరికావని, ఈటల ఈస్థాయికి రావడానికి కారణం కేసీఆరేనని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఆత్మగౌరవం కోసం వీడుతున్నానని చెప్పడం సరికాదని, తన ఆత్మరక్షణ కోసం బీజేపీ పార్టీ కాళ్ల వద్ద మోకరిళ్లారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్ఫుల్ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. తనకున్న అధికారం ద్వారా అక్కడి పేద వాళ్ల భూములు లాక్కున్నారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలే హైకమాండ్ అని, ఇకపైన సామాన్యులకు అన్యాయం చేస్తే ఊరుకోదని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడగానే పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో వాటిని ఆంధ్రప్రదేశ్లో కలిపి తెలంగాణకు అన్యాయం చేయడం మొదలుపెట్టిందన్నారు. ప్రతి ఇంటా సంతోషం, సంక్షేమం ఉండాలని కేసీఆర్ శ్రమిస్తూ, అసాధ్యం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించి ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మళ్లించిన ఘనత కేసీఆర్దేన్నారు. నలుగురు ఎంపీలు కాగానే బీజేపీ నాయకులు మిడిసిపడ్డారని, కానీ పట్టభద్రుల ఎన్నికలు, నాగార్జునసాగర్, మున్సిపల్, మహానగర పాలక ఎన్నికల వరదల్లో కొట్టుకుపోయి అడ్రస్ గల్లంతు అయిందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టగలిగే సత్తా బీజేపీకి ఎప్పటికీ లేదని ప్రజలే నిరూపిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నూకల శ్రీరంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామ్లాల్, మంచు అశోక్, వేణు, శ్రీనివాస్, అఫ్జల్, శ్రావణ్ పాల్గొన్నారు.