అభ్యర్థి ప్రకటనతోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకొనేందుకు బీజేపీ పాట్లు పడుతున్నది. ఇక్కడ ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేకపోవడంతో టీఆర్ఎస్ అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలని మొదటినుంచి ఎదురుచూసింది. టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డికి టికెట్ రాకపోతే కాషాయ కండువా కప్పుకుంటారని ఆశపడింది. కానీ, సీఎం కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శించి దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కు మంగళవారం బీ-ఫారం ఇచ్చారు. టికెట్ ఆశించిన చిన్నపరెడ్డి, కోటిరెడ్డికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో భగత్కు తమ మద్దతు ప్రకటించారు. దీంతో అయోమయంలో పడిన బీజేపీ.. చివరకు పానుగోతు రవికుమార్ను సోమవారం రాత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఎవరో కూడా నియోజకవర్గం ప్రజలకు తెలిదని స్థానికులు అంటున్నారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయమంటూ డబ్బా కొట్టుకొంటున్న కాషాయ పార్టీకి ఉప ఎన్నికలో అభ్యర్థిని వెతుక్కోవటం గగనంగా మారటం గమనార్హం. 2018 ఎన్నికల్లో ఇక్కడ చిన్న పల్లెలో ఉన్నన్ని ఓట్లుకూడా పొందలేకపోయిన బీజేపీకి ఈసారి ఆ మాత్రం కూడా రావని నాగార్జునసాగర్ నియోజకవర్గ రాజకీయాలపై అనుభవం ఉన్న నేతలు అంటున్నారు. అభ్యర్థి ప్రకటనతోనే ఆ పార్టీ ఓటమిని పరోక్షంగా అంగీకరించిందని అభిప్రాయపడుతున్నారు.