హైదరాబాద్: కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. మహమ్మారిని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలని చెప్పారు. అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడిపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు తగ్గినప్పటికీ మరణాల సంఖ్య పెరిగింది. వైరస్ ప్రభావంతో కొత్తగా 43 మంది మృతిచెందారు. నిన్న రాత్రి 8 గంటల వరకు 3,804 మంది బాధితులు కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,01,783కు చేరింది. ఇందులో 3,34,144 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 65,597 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..