హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ భావించారు. అందుకే రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ద్వారా అన్ని వర్గాల పేద బిడ్డలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడంతో నేడు గురుకుల విద్యార్థులు దేశంలోని గొప్ప గొప్ప విద్యా సంస్థల్లో స్థానం సంపాదించి తమ సత్తా చాటుతున్నారని ఆమె తెలిపారు.
తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ విద్యార్థులలో బదావత్ సోని, రాథోడ్ నరేశ్ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) సంస్థల్లో సీట్లు సాధించడం పట్ల వారికి అభినందనలు తెలిపారు.
బదావత్ సోని(ఎంపీసిఎస్) నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, తల్లి దినసరి వేతన కూలి. జిల్లా పరిషత్ లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న సోని, గిరిజన గురుకులంలో చదివి ట్రీచి ఐఐఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్2021-22కు సీటు సాధించింది.
అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన రాథోడ్ నరేష్(బికాం, హానర్స్) తల్లిదండ్రులు ఇద్దరూ దినసరి వేతన కూలీలు. సంగారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న నరేశ్, గిరిజన గురుకులంలో చదువుకుని వైజాగ్ ఐఐఎంలో సీటు సాధించాడు.
ప్రతిష్టాత్మకమైన ఐఐఎంలలో సీట్లు సాధించిన ఈ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందనపూర్వకంగా లక్ష రూపాయల నగదు పారితోషికం, ఒక ల్యాప్ టాప్ అందిస్తోందని మంత్రి తెలిపారు.
దీంతో పాటు వారికి అడ్మిషన్ సాధించిన ఐఐఎంలోని ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, మెస్ ఛార్జీలు పూర్తి ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. సకల సౌకర్యాలతో గురుకులాలు నడుస్తుండటంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారని మంత్రి తెలిపారు.