కరోనా మహమ్మారి రెండో దశ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత తరుణంలో అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని నల్లకుంటలోని ఫీవర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ అన్నారు. కొవాగ్జినా..? కోవిషీల్డా? ఏది తీసుకోవాలని ఆలోచించకుండా రెండింటిలో ఏదో ఒకటి వేసుకోవచ్చని సూచించారు. టీకా తీసుకోవడం ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు ధరించకుండా తిరగొద్దని, శానిటేషన్ పద్ధతులు పాటించాలని నగరవాసులకు సూచిస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ కరోనా విషయంలో పలు జాగ్రత్తలు ఇలా సూచించారు.
ఇంట్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించనవసరం లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. కిటికీలు తెరిచి ఉంచాలి. ఏసీలు వాడకపోతే మంచిది. భౌతికదూరం పాటించాలి. బయటకు వెళ్తే మాత్రం కచ్చితంగా మాస్కులు ధరించాలి.
వైరస్ ఈ సారి నిరుడు కన్నా ఎక్కువగా వ్యాపిస్తున్నది. లక్షణాలు లేనివారిలో కూడా పాజిటివ్ వస్తుంది. మాస్కు లేకుండా అరగంట ఎవరితోనైనా మాట్లాడితే చాలు వారికి కరోనా అంటుకుంటుంది. క్లబ్లు, పబ్బులు, పార్టీలు వ్యాప్తికి ఎక్కువగా దోహదపడుతున్నాయి
కరోనా వచ్చిన వారు టీకా తీసుకోకూడదు. కరోనా వస్తే14రోజులు ముగిసిన తరువాత మళ్లీ పరీక్షలు చేసుకోవాలి. నెగెటివ్ వచ్చిన తర్వాత 45 రోజుల విరామమచ్చి టీకా తీసుకోవచ్చు.
సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలో తెలియక చాలా మంది తికమక పడుతున్నారు. కోవ్యాక్సిన్ టీకా తీసుకున్న వారు 4వారాల తరువాత, కొవిషీల్డ్ తీసుకున్న వారు 6 నుంచి 8 వారాల తరువాత రెండో డోస్ తీసుకోవాలి.
టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ వచ్చే అవకాశముంది. కానీ స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడే అవసరం ఉండకపోవచ్చు. ప్రాణాపాయం ఉండదు. అయితే రెండు డోసులు తీసుకున్న తర్వాత రెండు వారాలు ఆగితే ఇక సమస్యనే ఉండదు. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.
కోరంటి దవాఖానలో రోజూ 1000 నుంచి 1500 వరకు ర్యాపిడ్ టెస్టులు, 1100 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాం. 300 నుంచి 400 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 80శాతం మంది హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. ఇండ్లలో వసతులు లేనివారిని సరోజినిదేవి కంటి దవాఖాన, నిజామియా, నేచర్క్యూర్, ఆయూష్ లకు పంపిస్తున్నాం. వ్యాధి తీవ్రత లేని వారికి ఇక్కడే చికిత్స చేస్తున్నాం. ఇక్కడ 100 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి.
18సంవత్సరాల లోపు వారు టీకా తీసుకోకూడదు.
గర్భవతులు, బాలింతలు, బ్లీడింగ్ డిసీజ్ ఉన్నవారు, ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే వారు, మల్టిపుల్ స్కిన్ ఎలర్జి ఉన్నవారు టీకా తీసుకోవాలా వద్దా అనే విషయం డాక్టర్ తో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
ఫస్ట్ డోస్ తీసుకొని ఎక్కువగా రియాక్షన్ అయిన వారు సెకండ్ డోస్ తీసుకోకపోవడమే మంచిది.
ఈ విషయంలో డాక్టరును సంప్రదించాలి.
వ్యాధి నిరోధక మందులు వాడే వారు డాక్టర్ సలహా మేరకు వారం పది రోజులు ఆ మందులు ఆపివేసి టీకా తీసుకోవాలి.
రెండు వ్యాక్సిన్లు ఒకేసారి తీసుకోవద్దు.
ఉదాహరణకు పోలియో, రూబెల్లా, రేబిస్ వంటి వ్యాక్సిన్లలో ఏదైనా తీసుకొని ఉంటే నాలుగు వారాల విరామమిచ్చి టీకా తీసుకోవాలి.