హైదరాబాద్: తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యారంగాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని సూచించారు.
కోవిడ్ కారణంగా చాలా రంగాలు నష్టపోయాయని చెప్పారు. విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. గురుకులాల్లో ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని మంత్రి సబితా రెడ్డి చెప్పారు. సర్కారు బడుల్లో 2.50 లక్షల మంది విద్యార్థులు చేరారన్నారు. అందులో 1.20 లక్షల మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. విద్యావ్యవస్థకు రూ.4 వేల కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థుల్లో నైతిక, మానవతా విలువలు పెంపొందించాలని సూచించారు.