ఆర్డీఎస్ కుడి కాల్వకు అనుమతే లేదు
ఈ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు
అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
జిల్లాలో 2 లక్షల మంది రైతులకు రైతుబంధు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ టౌన్, జూన్ 16 : ఆర్డీఎస్ ప్రాజెక్టుపై న్యాయంగా అన్ని హక్కులు తెలంగాణకు ఉన్నాయని.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ కుడి కాలువ నిర్మాణం చేపట్టిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు, ఎనుగొండ, పద్మావతి కాలనీ రోడ్డు, మున్సిపాలిటీ సమీపంలో, చిన్నదర్పల్లి వద్ద బ్రిడ్జి పనులు, నవాబ్పేట-టంకర రోడ్డు, సీసీ, డ్రైనేజీ ఆర్సీసీ పైప్లైన్కు సంబంధించి రూ.2.40 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు చిన్న నష్టం జరిగినా సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మంత్రి స్పష్టం చేశారు. ఆర్డీఎస్ను ఏపీ ప్రభుత్వం కేంద్రం, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలను సంప్రందించకుండా, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ పేరుతో లిఫ్ట్ పనులు ప్రారంభించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా, వాటికి పై ఎత్తులు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రైతులు ఆందోళ చెందాల్సి అవసరం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయిస్తున్నామని, రిజర్వాయర్లు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. పాలమూరు మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు, ప్రతి ఒక్కరిపై పనుల నాణ్యతను చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పాలమూరు పట్టణాభివృద్ధే తన ముందున్న లక్ష్యమన్నారు. జిల్లాలో 2 లక్షలకుపైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అయిందన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలని కర్షకులు సూచించారు. జిల్లాలో పంటలు బాగా పండుతుండటంతో గోదాములు సరిపోవడం లేదన్నారు. తెలంగాణ కాటన్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు రామాంజనేయులు, వనజ, నీరజ, కట్టా రవికిషన్రెడ్డి, నర్సింహులు, రామ్, గోవిందు, జంగమ్మ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, మాజీ కౌన్సిలర్లు జ్యోతి, శివశంకర్, విఠల్రెడ్డి, నాయకులు హన్మంతు, నగేశ్, శాంతిభూషణ్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
పండరీనాథ్జీకి నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు పండరీనాథ్జీ ఇటీవల మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ జిల్లా కేంద్రంలోని అతడి ఇంటికి చేరుకుని కుటుంబీకులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు
రూ.4654.22 కోట్లు రుణ ప్రణాళిక
మహబూబ్నగర్, జూన్ 16 : సన్న, చిన్న కారు రైతులతోపాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి రూ.4654.22 కోట్లు రుణాల లక్ష్యంతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు రుణాలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతుబంధుకు సంబంధించిన ప్రభుత్వం జిల్లాకు రూ.230.85 కోట్లు మంజూరు చేసిందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్లకు అందజేసిన నూతన కార్లను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ నాగరాజు, నాబార్డు ఏజీఎం శ్రీనివాస్, ఎస్బీఐ ఆర్మెట్టి డైరెక్టర్ బీఎస్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు ఇబ్బందులు రానివ్వకండి
కార్మికుల శ్రమతోనే నడుస్తూ లాభాలను ఆర్జిస్తున్న రాజ్వీర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలను బకాయిలను చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయకుండా సరైన సమయంలో వేతనాలు అందించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజ్వీర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు అందించడం లేదని విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇండస్ట్రీని సందర్శించి కార్మికుల సమస్యలను విన్నారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వేతనాలను, బకాయిలను వెంటనే విడుదల చేసేందుకు కంపెనీ యజమానులకు ఒప్పించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కార్మికులకు అండగా ఉండాలని తెలిపారు. కార్మికులను పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవనం సముదాయాన్ని కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. వెంటనే భవనం ప్రారంభించేందుకు అవసరమైన సౌకర్యాలను చేయాలని సూచించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, ఆర్అండ్బీ అధికారి సంధ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి
హన్వాడ, జూన్ 16 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం కొత్తపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బోయపల్లి-టంకర వరకు రూ.74 లక్షలతో వేసిన బీటీ రోడ్డు, చిన్నదర్పల్లి వద్ద ప్రధాన రహదరిపై రూ.75 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామానికి బీటీరోడ్డు వేశామన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్రాజ్, విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కరుణాకర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, సర్పంచులు అచ్చన్న, చెన్నమ్మ, రాములునాయక్, ఎంపీటీసీలు లక్ష్మమ్మ, అరుణ్, నాయకులు శివకుమార్, ఆశన్న, జహంగీర్, రమణారెడ్డి పాల్గొన్నారు.