‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయి. పారిశుధ్య పనులు పక్కాగా చేస్తుండడంతో పరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి వీధిని పరిశీలిస్తూ గ్రామ పంచాయతీ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు.
శాయంపేట, జూలై 8: మండలకేంద్రంలో బుధవారం రాత్రి పల్లెనిద్ర చేసిన అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రాజారావు గురువారం ఉదయం కాలనీల్లో పర్యటించారు. దళిత కాలనీ, పల్లెప్రకృతి వనం, శ్మశాన వాటికను పరిశీలించారు. దళితకాలనీలో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండి ఉండడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీపీ సిబ్బంది తక్కువగా ఉంటే అదనంగా నియమించుకుని పారిశుధ్య పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా రోడ్లపై గుంతలు, నీళ్లు ఉండొద్దని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారికి సూచనలు చేశారు. పారిశుధ్య పనులు చేసిన చోట యజమానుల సంతకాలు తీసుకోవాలన్నారు. కరోనా వల్ల శ్మశాన వాటిక పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు అదనపు కలెక్టర్ హరిసింగ్కు సర్పంచ్ రవి వివరించారు. ఏదేమైనా త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ను ఆదేశించారు. డంపింగ్ యార్డుల్లో చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియను చేపట్టాలన్నారు. పల్లెప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అంకితభావంతో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, సర్పంచ్ కందగట్ల రవి, కార్యదర్శి రమణారెడ్డి, విద్యుత్ ఏఈ చంద్రమౌళి పాల్గొన్నారు.
పల్లెల ప్రగతితోనే రాష్ర్టాభివృద్ధి..
పర్వతగిరి/గీసుగొండ: పల్లెలు సంపూర్ణంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తుందని డీపీవో ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. మండలంలోని వడ్లకొండ, రోళ్లకల్లు, నారాయణపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీలను పరిశీలించారు. పల్లెప్రగతిలో గ్రామాలను శుభ్రం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలన్నారు. పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజుయాదవ్, ఏపీవో సుశీల్కుమార్, కార్యదర్శి సునీల్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
సంగెం: గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని డీఈ మల్లికార్జున్ ఏఈలను ఆదేశించారు. పల్లెప్రగతిలో భాగంగా గవిచర్లలో విద్యుత్ లైన్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. లూజ్ లైన్లు, ఒరిగిన స్తంభాలను సరిచేయాలని, నిరూపయోగంగా ఉన్న వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితిలో విద్యుత్ తీగలు వేలాడొద్దన్నారు. శనివారంలోగా అన్ని పనులు పూర్తి కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దొనికెల రమ-శ్రీనివాస్, ఏడీఈ ప్రశాంత్, ఏఈలు తిరుపతిరెడ్డి, శ్రీకాంత్, లైన్ ఇన్స్పెక్టర్ అంజత్ఖాన్, లైన్మన్ రవి, ఉపేందర్ పాల్గొన్నారు.
జోరుగా పట్టణప్రగతి పనులు
పరకాల: పట్టణప్రగతి పనులు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో జోరుగా కొనసాగుతున్నాయి. కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గురువారం సిబ్బంది వీధుల్లో పారిశుధ్య పనులు చేశారు. ఈ సందర్భంగా రోడ్లపై చెత్త, పిచ్చి మొక్కలను తొలగించడంతోపాటు సైడ్ డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. చెత్త పోగు, నిర్వహణపై కౌన్సిలర్లు వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాల్లో పనుల పరిశీలన
దామెర/ఖానాపురం: మండలంలో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి ఓగ్లాపూర్, పసరగొండ, పులుకుర్తి, దామెర, ముస్త్యాలపల్లి, ఊరుగొండ, దమ్మన్నపేట, దుర్గంపేటలో పర్యటించారు. వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించడం, గుంతల్లో మట్టిపోయడం, విద్యుత్ లైన్లను సరి చేయడం వంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు మేడిపల్లి సాంబయ్య, సత్యనారాయణరెడ్డి, రాణి, ఎంపీవో యాదగిరి, ఏపీవో శారద, కార్యదర్శులు నరేశ్, సునీల్కుమార్, శివకృష్ణ పాల్గొన్నారు. ఖానాపురం మండలవ్యాప్తంగా పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మనుబోతులగడ్డలో అభివృద్ధి పనులను మండల ప్రత్యేకాధికారి దేవేందర్, వేపచెట్టుతండా, భద్రుతండాలో పనులను ఎంపీడీవో సుమనావాణి పరిశీలించారు.
వేగంగా శ్మశాన వాటిక పనులు
గీసుగొండ: ఊకల్లో శ్మశాన వాటిక పనులు వేగంగా సాగుతున్నట్లు ఏపీవో మోహన్రావు తెలిపారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చేయించాలన్నారు. ఆయన వెంట ఏఈ ప్రభాకర్, సర్పంచ్ మొగసాని నాగదేవత, వార్డు సభ్యులు ఉన్నారు. మండలంలోని 21 గ్రామాలకు మండలస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి పల్లెప్రగతిని విజయవంతం చేస్తున్నట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. మరియపురం, మచ్చాపురం, గంగదేవిపల్లి, దస్రుతండా, కొమ్మాల, విశ్వనాథపురంలో హరితహారంలో నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతోపాటు పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్లు అల్లం బాలిరెడ్డి, నాగేశ్వర్రావు, వీరాటి కవిత, సరోజన, మల్లారెడ్డి, ప్రకాశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
నడికూడ: పల్లెప్రగతి పనులను అశ్రద్ధ చేయొద్దని డీఎల్పీవో కల్పన అన్నారు. పులిగిల్లలో ఆమె డ్రైనేజీలు, నర్సరీ, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలకుర్తి సదానందం, ఎంపీవో అఫ్జల్, స్పెషలాఫీసర్ వినిశెట్టి బాబు, కార్యదర్శి నర్సింగం, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.