హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,568 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని, వీటిలో 3,572 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. ప్యాసింజర్ వాహన శ్రేణి ఆటోమొబైల్ సంస్థ మ్యారీస్ గ్యారేజెస్ (ఎంజీ) రూపొందించిన 7 సీటర్, 5 సీటర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలను గురువారం మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివాసంలో మంత్రి పువ్వాడ ఆవిషరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ విధానానికి ఆదరణ లభిస్తున్నదని, ఈవీల కొనుగోళ్లు జోరందుకొంటున్నాయని చెప్పారు.
వివిధ ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే ప్రక్రియలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును, రోడ్డు ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేశామని మంత్రి పువ్వాడ చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విసృ్తతస్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.