నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు అడుగడుగునా వివక్షే చూపారు సీమాంధ్ర పాలకులు. సాగర్ ప్రాజెక్టును ప్రతిపాదించిన ఏలేశ్వరం వద్ద కట్టాల్సి ఉండగా.. 19 కిలోమీటర్ల దిగువన నిర్మించి తెలంగాణకు అన్యాయం చేశారు. దీంతోపాటు సాగర్ కుడి, ఎడమ కాల్వల డిజైన్లలోనూ పక్షపాతం చూపారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా దిగువన టెయిల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకునే నీటిని తిరిగి సాగర్ జలాశయంలోకి పంపాలనే నిబంధనలనూ ఖాతర్ చేయలేదు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేయకుండానే నీటిని అక్రమంగా ఆంధ్రాలోని కృష్ణా డెల్టాకు తరలించుకుపోతున్నా నాటి తెలంగాణ మంత్రులు నోరు మెదపలేదు, అడ్డు చెప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. నాటి అక్రమాలకు అడ్డుకట్ట వేసి నీటిని తిరిగి జలాశయంలోకి పంపించడం ప్రారంభించారు.
ప్రధానంగా సాగునీటి కోసం నిర్మాణం చేసిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నాటి పాలకులు నిర్ణయించారు. ప్రాజెక్టు వద్ద పవర్ప్లాంటు ఏర్పాటు చేస్తే నీరు రైతులకు ఉపయోగపడకుండా ఎప్పుడూ కిందికి పోతుంది. ఈ క్రమంలో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలంటే కరెంటు ఉత్పత్తికి ఉపయోగించిన నీటిని తిరిగి సాగర్ జలాశయంలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, జల వనరుల నిపుణులు పేర్కొన్నారు. దీంతో సాగర్ దిగువన 21 కిలోమీటర్ల దూరంలో అడవిదేవులపల్లి వద్ద టెయిల్ పాండ్ పూర్తి చేసిన తర్వాతే సాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని నిబంధనలు పెట్టారు. కానీ.. అది రాతలకే పరిమితమైంది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో సాగర్ జలాశయంలోని నీటిని ఆంధ్రాకు అక్రమంగా తరలించుకుపోతున్నా నాటి తెలంగాణ మంత్రులు, నాయకులు పట్టనట్లుగా వ్యవహరించారు.
జలాశయంలోకి పంపింగ్ఇలా..
సాగర్ మెయిన్ విద్యుత్ ప్లాంటు వద్ద 889 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం వదిలే నీటిని టెయిల్పాండ్ వద్ద నిల్వ చేస్తారు. సాగర్ నుంచి టెయిల్పాండ్ ప్రాజెక్టు వరకు 21 కిలోమీటర్ల పొడవునా జలాశయంగా సుమారు 7 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. విద్యుత్ తయారీ అనంతరం పీక్ అవర్స్లో ఏడు రివర్సబుల్ టర్బైన్ల ద్వారా నీటిని సాగర్ జలాశయంలోకి తరలిస్తారు. విద్యుత్ ఉత్పత్తి నిర్ణయం హైదరాబాద్లోని సెంట్రల్ గ్రిడ్ కంట్రోల్లో ఉంటుంది. విద్యుత్ సౌధ లోడ్ డిశ్చార్జ్ సెంటర్ మానిటరింగ్ చేస్తుంది. హైడల్ పవర్ ఒక్క నిమిషంలోనే అవుట్ఫుట్గా వస్తుంది. సాగర్ జలాశయంలో నిండా నీరు ఉన్న సమయంలో ఒక్క యూనిట్ విద్యుత్ తయారీకి 3,500 క్యూసెక్కుల నీరు బయటకు వస్తుంది. పీక్లోడ్ సమయం తెల్లవారుజామున 4నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, సాయంత్రం 5నుంచి రాత్రి 11గంటల వరకు విద్యుత్ ఉత్పత్తి అధికంగా అవసరం ఉంటున్న నేపథ్యంలో కరెంటు ఉత్పత్తి చేస్తారు. అనంతరం పీక్లోడ్లో దిగువకు వచ్చిన నీటిని జలాశయంలోకి పంపింగ్ చేస్తారు. కరెంటుకు ఎంత నీరు వాడుతారో అంత నీటిని జలాశయంలోకి పంపిస్తారు.
స్వరాష్ట్రంలో నెరవేరిన లక్ష్యం ..
ఐదు దశాబ్దాల జల దోపిడీకి స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అడ్డుకట్ట పడింది. ఇన్నేండ్లు సాగర్ నుంచి వేలాది టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఆంధ్రాలోని కృష్ణా డెల్టాకు అక్రమంగా తరలించుకుపోయారు. ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నిసార్లు పోరాటాలు చేసినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ టెయిల్పాండ్పై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో చర్చించి సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి వదిలే నీటిని టెయిల్పాండ్ వద్ద నిల్వ చేసి జలాశయంలోకి పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు 2018 జనవరిలో రివర్స్బుల్ టర్బైన్ల ద్వారా నీటిని పంపే ప్రక్రియను ప్రారంభించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాల మధ్య అధికారుల బదలాయింపు, ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం టీఎస్ జెన్కో అధికారులతో వింగ్ను ఏర్పాటు చేసింది. ఆ బృందం ప్రాజెక్టు నీటి విడుదల డాటాను సేకరిస్తున్నది. సాగర్ జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం కిందికి వదులుతున్న నీటిని తిరిగి ప్రాజెక్టులోకి పంపడం ద్వారా జలాశయం నీటితో కళకళలాడుతున్నది.
సాగదీసిన ప్రాజెక్టు నిర్మాణం..
సమైక్యాంధ్ర పాలకులు టెయిల్పాండ్ నిర్మాణంపై అంతగా శ్రద్ధ చూపలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి 1976లో ఒకసారి, 1984లో మరోసారి అనుమతి లభించింది. 1994లో రూ.351 కోట్లు మంజూరు చేసినప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. చివరకు ఆంధ్రాకు లబ్ధి చేకూరే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2006లో జలయజ్ఞంలో భాగంగా రూపకల్పన చేశారు. దీనిపై తెలంగాణలో వ్యతిరేకత రావడంతో టెయిల్పాండ్ను కూడా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. రూ.464 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించారు. కానీ.. పనులు మాత్రం అంతవేగంగా కొనసాగించలేదు. దీని తర్వాత మొదలైన పులిచింతల ప్రాజెక్టు మాత్రం వేగంగా పూర్తిచేసి నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. టెయిల్పాండ్ పనులను ఆలస్యంగా పూర్తి చేసినా ప్రాజెక్టును మాత్రం ప్రారంభించలేదు. దీంతో ప్రాజెక్టు వద్ద నీటిని నిల్వ చేయకపోవడంతో నీటి అక్రమ తరలింపు కొనసాగుతూనే వచ్చింది.
50 మెగావాట్ల పవర్ప్లాంట్ ఆంధ్రా వైపునకు తరలింపు
టెయిల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు 25 మెగావాట్ల రెండు విద్యుత్ ప్లాంట్లు కూడా నిర్మించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాలు, పవర్ ప్లాంట్లు, రహదారులు అన్నీ తెలంగాణ ప్రాంతంలోని బౌద్ధంపాడులో నిర్మించాల్సి ఉండగా.. వాటిని పూర్తిగా మార్చేశారు. అనుమతులు లేవని కుంటి సాకు చెప్పి ఆంధ్రా వైపు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ఇక్కడి మంత్రులు, నాయకులు అడ్డుకున్న పాపాన పోలేదు. ఈ వైపు నిర్మాణాలు జరిగితే ఎంతో అభివృద్ధి జరిగేది. ఉపాధి లభించేది.
వేలాది ఎకరాలు సాగులోకి..
టెయిల్పాండ్.. 21 కిలోమీటర్ల పరిధిలో ఏడు టీఎంసీల నీటి నిల్వతో పెద్ద జలాశయంగా మారింది. దీంతో 21 కిలోమీటర్ల పరిధిలోని అన్ని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. ఈ క్రమంలో బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో కృష్ణా తీరంలోని వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. రైతులు పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. అదేవిధంగా టెయిల్పాండ్ బ్యాక్ వాటర్తో రెండు జిల్లాలకు మిషన్ భగీరథ నీటిని, లిఫ్ట్లు ఏర్పాటు చేసి సాగు నీరు అందిస్తున్నారు.
ఇవీ కూడా చదవండీ…