న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. ఇప్పటి వరకూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నట్లు చూపిస్తున్న ఈ ప్రభుత్వ గణాంకాలే దీనికి నిదర్శనం. రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకున్న ప్రతి 10 వేల మందిలో సగటున కేవలం నలుగురు, కొవిషీల్డ్ తీసుకున్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే కరోనా బారిన పడినట్లు బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తంగా చూస్తే కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న మొత్తం 17,37,178 మందిలో కేవలం 695 మంది (0.04 శాతం) మాత్రమే కొవిడ్ బారిన పడ్డారు. ఇక కొవిషీల్డ్ తీసుఉన్న మొత్తం 1,57,32,754 మందిలో కేవలం 5,014 మందికి మాత్రమే కరోనా సోకినట్లు ఈ డేటా తేల్చింది. వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వారికి ఈ గణాంకాలే సమాధానం చెబుతున్నాయి.
ఓవరాల్గా తీవ్రమైన అనారోగ్యం విషయానికి వస్తే ఇండియాలో ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లు వంద శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. సెకండ్ వేవ్ దేశాన్ని చుట్టుముట్టిన ఈ సమయంలో ఇవి ఊరట కలిగించేవే.
ఇక కేవలం ఒకే డోసు తీసుకున్న వాళ్లలో కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్యను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు కొవాగ్జిన్ ఒక డోసు తీసుకున్న వాళ్ల సంఖ్య 93,56,436 కాగా.. అందులో 4208 మంది (0.04 శాతం) కరోనా బారిన పడ్డారు. ఇక కొవిషీల్డ్ ఫస్ట్ డోసును 10,03,02,745 మంది తీసుకోగా.. వారిలో 17,145 మంది(0.02 శాతం)కి కరోనా సోకింది.