హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరాధార అరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలో మంత్రి ఈ విధంగా పేర్కొన్నారు. నాపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిరాధారం, దురుద్దేశపూరితం. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేకుంటే మీ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్పై న్యాయపరంగా ముందుకెళ్తా.
నా స్వంత మండలం పాన్గల్ మండల కేంద్రం సమీపంలో ఉన్న భూములు నేను, నా సతీమణి పేరు మీద ఉన్న వివరాలు 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిందే. 30 ఎకరాలు నా పేరు మీద, 10 ఎకరాలు నా సతీమణి పేరు మీద ఉంది. 15 ఏళ్లుగా అందులో మామిడితోట ఉంది. స్థానికంగా డాక్టరైన నా కూతురు అక్కడి ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు నా సతీమణి స్వంత నిధులు, పాన్గల్ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణంతో నిర్మించబడింది. రెండేళ్ల క్రితం స్వచ్చందంగా గోశాలను నిర్వహించేందుకు 2.5 ఎకరాలు కొత్తగా కొనడం జరిగింది. ఇటీవల చండూరు గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూములతో సహా నాకు మొత్తం కేవలం 50 ఎకరాల లోపే ఉంది. కానీ 200 ఎకరాలు ఉందని ఆరోపించడం నా ప్రతిష్టకు భంగం కలిగించడమే.
వనపర్తి, పెబ్బేరు పట్టణాలలోని భూములపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం. 1984 నుండి నేను వృత్తి రీత్యా న్యాయవాదిని .. ఈ భూములకు సంబంధించిన వ్యాజ్యాలలో 1990 దశకంలో వృత్తి రీత్యా నా క్లయింటు ఎస్. అజయ్ కుమార్ కుటుంబం తరపున వాదించడం జరిగింది. 2001 తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నందున అ కేసుల తరపున వాదనను వదిలేయడం జరిగింది. ఆ తరువాత వచ్చిన న్యాయస్థాన ఉత్తర్వులు, తీర్పులతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ భూములపై వివిధ ట్రిబ్యునల్, ఇతర కోర్టులు నాటి నా క్లయింట్లకు వ్యతిరేకంగా 2005, 2013లో తీర్పులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావడం జరిగింది .. అప్పటి ఆర్డీఓలు ఇచ్చిన తీర్పులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావితం చేసినట్లా ?
నా క్లయింటు అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా 2005, 2013 లలో ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులను హైకోర్టు సీసీఎల్ఎల్లో విచారించడం జరిగింది. ఇప్పటికీ హైకోర్టులో వివాదమున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఉన్న రాజా రామేశ్వరరావు, వారసులు, వంశస్థులంతా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. మరి ఈ భూములకు సంబంధించిన వివాదం నాకు ఎలా ఆపాదిస్తారు. ఈ విషయంలో నా మీద ఆరోపణ చేయటానికి ప్రధాన కారణాలు నా ప్రతిష్టకు భంగం కలిగించడం, ఈ భూముల మీద హక్కులు కోరుకుంటున్న రాజా వారి ట్రస్టుకు అనుకూలంగా మాట్లాడడమే.
వనపర్తి ఇనాం భూమి ముమ్మాటికీ పేద రైతులకు చెందింది. నా క్లయింటు ప్రత్యర్దులైన వారి దాయాదుల పక్షమే ప్రస్తుత ఉత్తర్వులున్నప్పుడు దీనిని నాకు ఎలా ఆపాదిస్తారు ? మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపణలు నిజమైన హక్కు దారులకు మేలు చేసేవి కావు. ఇవి నిజంగా సంబంధిత హక్కుదారులు అని సంపత్ కుమార్ చెప్పుకుంటున్న వాళ్లు ప్రభుత్వానికి అప్పగిస్తే , అందుకు వారి నుండి రిలింక్విషింగ్ డాక్యుమెంట్ ప్రభుత్వానికి అప్పగిస్తే .. అట్టి భూమిని పేదలకోసం డబల్ బెడ్రూం ఇండ్లు లేదా మరో ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేయించేందుకు సిద్దం. మీ బంధువైన, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజా కృష్ణదేవరావు తరపున వకాల్తా పుచ్చుకున్న వారంతా ఆయన తరపున భూములు ప్రభుత్వానికి అప్పగిస్తారా ? అని మంత్రి ప్రశ్నించారు.