హైదరాబాద్ : చిరు ధాన్యాలతోనే పోషకాహార భద్రత లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పంటల మార్పిడిలో భాగంగా నూనె గింజలతో పాటు చిరుధాన్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు. అన్నిరకాల చిరుధాన్యాలను తినడంతో సరైన పోషకాహార భద్రత లభిస్తుందన్నారు. చిరుధాన్యాల సాగు వైపు రైతులు దృష్టి సారించాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.
అగ్రోస్ బోర్డు సమావేశం సందర్భంగా రాజేంద్రనగర్లోని జాతీయ చిరుధాన్యాల పరిశోధన (ఐఐఎంఆర్) సంస్థలోని వివిధ యూనిట్లను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. మంత్రితో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంత్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ విలాస్, న్యూట్రిహబ్ సీఈవో డాక్టర్ దయాకర్ రావు, అగ్రోస్ ఎండీ రాములు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద రైతులే చిరుధాన్యలను పండిస్తారన్న ధోరణి పోవాలి అన్నారు. ప్రతి రైతు తన పొలంలో 10 నుండి 20 శాతం సాగుభూమిని చిరుధాన్యాల సాగుకు కేటాయించాలని సూచించారు. వ్యవసాయ శాఖ చిరుధాన్యాల సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో మరింత అవగాహన పెంచి చైతన్యవంతం చేస్తుందన్నారు. ఇదివరకే అందుబాటులో ఉన్న ప్రాసెసింగ్ సౌకర్యాలు క్షేత్రస్థాయికి చేరాలి అని మంత్రి అన్నారు.
చిరుధాన్యాల మార్కెటింగ్పై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ల సదుపాయాలు క్షేత్రస్థాయికి చేరేందుకు అగ్రోస్ సంస్థ కృషిచేయాలి అని సూచించారు. ఐఐఎంఆర్ సహకారంతో ఔత్సాహిక యువతను అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్స్ ద్వారా చిరుధాన్యాల ప్రాసెసింగ్ వైపు మళ్లించాలన్నారు. ఈ దిశగా ఐఐఎంఆర్ చేస్తున్న కృషి అభినందనీయం అని మంత్రి కొనియాడారు.
అన్నిరకాల చిరుధాన్యాలకు కేంద్రం కనీస మద్దతుధర ప్రకటించాల్సిన అవసరం ఉంది అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లలో యూనిట్ల ఏర్పాటులో ఐఐఎంఆర్ ముందుకురావాలన్నారు. ప్రజలందరూ చిరుధాన్యాల వినియోగాన్ని పెంచుకోవాలి అని మంత్రి సూచించారు.