హైదరాబాద్ : తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని సైతం కొంటామని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. శానిటైజర్ వినియోగించాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో చివరి ఆయకట్టు రైతులకు ఆఖరుతడికి నీళ్లందించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామన్నారు. వేసవిలో ప్రకృతివనాలలో చెట్లు ఎండకుండా ఈ రెండు నెలలు సర్పంచులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లందించి కాపాడుకోవాలని మంత్రి కోరారు. ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించి వెంటనే కాల్వల పూడికతీత పనులు ప్రారంభించాలన్నారు. గ్రామాలలో పాడుబడ్డ ఇళ్లను ఈ రెండు నెలలలో గుర్తించి తొలగించి శుభ్రంచేయాలన్నారు.
అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సిద్దంకావాలని.. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యతను ప్రతి కార్యకర్త భుజాన వేసుకునాలని కోరారు. కరోనా విస్తృతి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని .. తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. కరోనా నుండి పూర్తిగా కోలుకున్నానని .. త్వరలోనే తిరిగి ప్రజాసేవకు మీ ముందుకువస్తాని నిరంజన్ రెడ్డి అన్నారు.