వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.కోటి 16 లక్షలతో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో వనపర్తిలో అందిస్తున్న, అందించాల్సిన సేవలు, వసతులపై సమీక్ష నిర్వహించారు.
గాంధీనగర్ పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేశామని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అందుబాటులో 150 ఆక్సిజన్ బెడ్లు, 2 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ నేత మామిడిమాడ రంగారెడ్డి కుమారుడి సహాయంతో త్వరలో మరో వెంటిలేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సెకండ్ వేవ్ లో 53046 మందికి పరీక్షలు నిర్వహించగా 6384 మందికి కరోనా నిర్దారణ అయిందన్నారు.
35 మంది మినహా అందరూ సురక్షితంగా ఉన్నారన్నారు. 52 మంది ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 98 శాతం మంది కరోనా నుండి బయటపడుతున్నారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వారు అనవసరంగా ఆందోళన చెందవద్దని, కేవలం 2 శాతం మందికి మాత్రమే తీవ్రంగా ఉంటున్నదన్నారు. అనస్థీషియా డాక్టర్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఈ రెండు నెలలకు అవసరమైన వైద్యులను వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుని వారు విధులలో చేరేలా చూసుకోవాలన్నారు. విధులకు రానివారి స్థానంలో మరొకరిని నియమించుకోవాలన్నారు. గ్రామాలలో 45 ఏళ్లు నిండిన అందరూ వెంటనే టీకా వేయించుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని నిరంజన్ రెడ్డి కోరారు. జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ హరీష్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులున్నారు.